Thursday, December 8, 2011

ఆసరసాల - గంటేడ గౌరునాయుడు

కధను డౌన్లోడ్ చేసుకోడానికి


లేదా

నవ్య వీక్లీలో చదువుటకు జనవరి 12, 2011 సంచిక తెరిచి అందులో గౌరునాయుడుగారి ఇంటర్వ్యూ, కధా చూడగలరు

లేదా

ఈ క్రింది లింకును నొక్కగలరు.

Wednesday, December 7, 2011

మట్టిమీద 'మమకారం'

(23 Nov) ఉద్యమం కోసం కథకుడైన వాడే అట్టాడ అప్పల్నా యుడు. అందుకు ఆయన సాహిత్యమే సాక్ష్యం. 'పువ్వుల కొరడా'తో కథల బండి ఎక్కిన అప్పల్నాయుడు ఎనభయ్‌కి పైగా కథలు రాశారు. అందులో పదిహేడేళ్ల క్రితం రాసిన 'మమకారం' ఇవాళ రైతులోకం క్రాప్ హాలీడే ప్రకటించ వలసిన పరిస్థితులను ఆనాడే వివరిస్తున్నట్టు ఉంటుంది. విశాఖలో ఉద్యోగం చేసే కొడుకు, కోడలూ, మనవ రాలూ, ఆ ముసలితల్లి ఓ కుటుంబం. అప్పు చేసి పట్నంలో ఇల్లు కట్టిన కొడుకు ఆ అప్పు తీర్చడానికి ఊరులో పొలం అమ్మాలని కౌలు రైతు సిమ్మన్నకు కబురు చేస్తాడు. ఒకరోజు సిమ్మన్న ఓ గుమ్మడికాయ, భుజమ్మీద రెండు మూటల్లో నువ్వులు, వేరుశెనగకాయలు తీసుకుని 'నడిచొచ్చే పంట మొక్కలా' వచ్చి నిలిచాడు. ఆ ముసలితల్లికి పొలమ్మీద మమకారం. పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్లు అన్నీ ఆ పొలమ్మీద పంటతోనే జరిగాయి. భర్త చెమటధారలతో పండించిన పొలం అదే. పొలాన్ని అమ్మవద్దంటుంది తల్లి. పడమటి రెడ్లు భూములని మంచి రేటుకు కొంటున్నారని, ఈ సమయంలో అమ్మితే లాభసాటిగా ఉంటుందని కొడుకు ఆలోచన. సిమ్మన్న కూడా పొలం అమ్మకం సరికాదనే చెబు తాడు. 'సేపల సెరువులకోసం భూముల్ని వాడితే పంట భూమి పనికిరాని ఎడారైపోతుంది బావ్' అంటాడు. తల్లి తన కోపాన్ని మౌనంగా ప్రకటిస్తుంది. దాంతో భూమి అమ్మే ఆలోచన అప్పటికి ఆగింది. విశాఖ నుంచి హైదరాబాద్ బదలీ అయిన కొడుకుతో వెళ్లి కోడలు, మనవరాలితో కొంచెం బాగానే గడిపినా మన సంతా సొంతూరులోని పొలమ్మీదనే తల్లికి. ఓసారి అంటుం ది కొడుకుతో, 'సిమ్మన్న యింతదూరం రాలేడు సంక్రాంతికి నేనే ఎల్తాన్రా ఊరు' అని. పక్షవాతం సోకిన తల్లి ప్రయాణం చేయడం సరికాదని, వద్దంటా డు కొడుకు. 'సొంత మట్టి మీద ఊపిరిపోతే ఇంకేటి కావాల.. బాబొరే! నేను గాని ఇక్కడ సచ్చిపోతే అస్థికలైనా వంశధారల కలిపీ'' అంటుంది తల్లి, అదో అపురూపమైన కోరికలా. చేపల చెరువుల కోసం పడ మటి రెడ్లు భూముల్ని ఎక్కువ ధరకి కొనడానికి ముందుకు రావడంతో కొడుకు మళ్లీ భూమి అమ్మకానికి పెడ తాడు. అప్పటి నుంచి మౌన ముద్ర దాల్చిన ముసలి తల్లి, నేలకు దూరమైన దిగులుతోనే తనువు చాలిస్తుంది. ఆనందంగా ఉన్న ప్పుడు తల్లిని, 'తులసి మొక్క గాలికి కదలాడినట్టుగా ఉం ద'ంటాడు రచయిత. తరువాత రోదించే అమ్మ, 'దుప్పటి లో 'దుఃఖపు మూట'లా ఉందంటాడు. తల్లి కోరిక ప్రకారం అస్థికలని వంశధారలో కలపడానికి సొంతూరికి బయలు దేరతాడు కొడుకు. రైలు దిగి ఊరికి వెళ్లే దారిలో తోటలో సంత జరుగుతుంది. అక్కడివారు కొందరు తనని పోల్చు కోలేక పోతారు. తాను కొందరిని గుర్తు పట్టలేకపోతాడు. గుర్తు పట్టి తనను పలకరించి తల్లి పోయిన విషయం తెలిసి సానుభూతి చూపిస్తారు. ఊరు చాలా మారిపోతుంది. ఆ ఊరి బతు కులు ఎలా ఉన్నాయంటే, ''ఇరిగిన మం చం, వొరిగిన పంచ, కరుపట్టిన కంచాలు'' అని మూడు ముక్కల్లో తమ పేదరికాన్ని వివరిస్తుంది మేనత్త. వంశధారలో తల్లి అస్థి కలు కలిపి తిరిగి బయలుదేరిన కొడుకు సంత తోట దగ్గరికి వచ్చేసరికి నిర్మాను ష్యంగా ఉంటుంది. ఓ చెట్టు కింద మాత్రం ఒకడు గారడీ చేస్తున్నట్టు చేతులూ పుతూ కేకలేస్తుంటా డు. 'సూస్కోండి! సూస్కోండి! మీరు సూస్తండగానే ఈ టెంక సెట్టైపోద్ది. కొమ్మకొమ్మకీ గుత్తులు గుత్తులు కాయలు. కొమ్మలు నరక్కండి. సెట్టు కొట్టీకండి! సెడిపోతారు!' అంటూ శూన్యంలోకి చూస్తూ పిలు స్తుంటాడు. ఆ వ్యక్తిని గుర్తు పడతాడు. చింపిరిజుట్టు తో 'ఎండిన బీరపాదులా' ఉన్న అతడు ఒకనాడు 'నడిచే పంటమొక్కలా'కనిపించిన సిమ్మన్నే. సొంత గడ్డ మీద మమకారాన్ని వదులుకోలేక తల్లి ఈ లోకాన్ని వదిలేసిందనే వ్యథ, పొలం మీద మమకారం వదులుకోలేక సిమ్మన్న పిచ్చివాడైపోయాడన్న వేదన... పల్లె నుంచి పట్నాలకీ, పట్నాల నుంచి నగరాలకీ పరిగెడుతూ పోటీ పడుతూ అందని అంతస్తుల కోసం మమతలకూ, మమకారాలకూ, అనుబంధాలకూ ఇన్‌స్టాల్‌మెంట్‌ల వారీ గా చెల్లుచీటీ రాస్తున్న తరం... ముందుకు వెళుతున్నామా, వెనక్కా? ఈ పరుగులు ఎటు? అని మథన పడుతూ తిరు గు ప్రయాణమైన కథకుడిని చేపలచెరువులైపోయిన పొ లాల మీంచి పొలుసు వాసన వెంటాడుతూనే ఉంటుంది. నేడు రైతు ఎదుర్కొంటున్న దుస్థితిని ఆనాడే (1994, మే మాసం రచన మాస పత్రిక) అంచనా వేసిన రచయిత దార్శనికత అద్భుతం. ''వ్యవసాయం గిట్టుబాటు కాని వృత్తి అయింది. రాబోయే రోజుల్లో మరీ కష్టం. విత్తనాలూ ఎరువులూ విదేశీ కంపెనీలు అమ్ముతాయి. ఈ సబ్సిడీలు గట్రా ఉండవు. ఇక ముందు మీరు కొనలేరు. అమ్మడానికి మీ దగ్గర ఏమీ ఉండదు. రాబోయే రోజుల్ల రైతు పరిస్థితి అదీ!'' అని ప్రధాన పాత్ర చేత రచయిత చెప్పించడం అద్భుతం. - గంటేడ గౌరునాయుడు కవీ, కథకుడూ, గాయకుడు కూడా అయిన గంటేడ గౌరునాయుడు 'కళింగాంధ్ర ఉచ్ఛ్వాస నిశ్వాసలను కథనం చేస్తున్న రచయిత.' మూడు కవితా సంపుటులూ, రెండు కథా సంకలనాలను అచ్చేశారు. 1984 నుంచీ కథలు రాస్తున్న గంటేడ, చాసో అవార్డు, రా.వి.శాస్త్రి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం సత్కారం అందుకున్న రచయిత. అట్టడుగు ప్రజల జీవిత సత్యాలనే ఇతివృత్తాలుగా తీసుకురాసే అట్టాడ అప్పల్నాయుడు కథ 'మమకారం' ఇక్కడ పరిచయం చేసినందుకు గౌరునాయుడుకు కృతజ్ఞతలు.

మాయ - గంటేడ గౌరునాయుడు

దుప్పలరవి గారి బ్లాగు నుండి

సూర్య పత్రికలో గంటేడ గౌరునాయుడు కధల పరిచయ వ్యాసం - రామతీర్ధ

ఉత్తరాంధ్రలో నదులెక్కువ. కథకులూ ఎక్కువమందే. శ్రీకాకుళం ప్రాంతాన్ని కథలకెత్తిన బతుకు గంప గంటేడ గౌరు నాయుడు . 1997లో వెలువడిన గౌరు నాయుడు కథాసంపుటి ‘ఏటి పాట’కు ప్రశంసగా వెనుక పేజీలో ఇలా అన్నారు కారా మాస్టారు: ‘ఆంధ్ర దేశానికి ఓ అంచున ఉన్నాయి మేరండి, కురుపాం కొండలు. ఆ ప్రాంతాల జన జీవనాన్ని నిబద్ధతతో చిత్రిస్తాడు గౌరు నాయుడు. అందుకే ఆయన కథలంటే మీకులానే నాకూ ఇష్టం’. రెండు దశాబ్దాలుగా గౌరు నాయుడి నిబద్ధత కొనసాగుతోంది కథలుగా, కవితలుగా, దీర్ఘ కవితలుగా, గీతాలుగా. ఈ ప్రయాణంలో ‘ఏటి పాట’, ‘కళింగోర’, ‘గీతాంజలి’, ‘నాగేటి చాలుకు నమస్కారం’, ‘పాడుదమా స్వేచ్ఛా గీతం’, ‘నాగలి’, ‘నదిని దానం చేశాక’, ‘ఒక రాత్రి- రెండు స్వప్నాలు’ గంటేడ కలంనుంచి వెలువడ్డాయి. అభివృద్ధి పేరిట విధ్వంసం గ్రామ జీవన మూలాలను నిర్హేతుకంగా తుడిచి పెడుతున్నప్పుడు, నమోదయ్యే జనుల పచ్చి కోపం, వెచ్చని వెతలు సహజంగా గౌరునాయుడు చెప్పే కథలలో బలంగా కనుపిస్తాయి.

1997లోనే గౌరునాయుడి కథల్లో మరో ప్రముఖ కథకుడు అట్టాడ అప్పల్నాయుడికి క్షతగాత్ర గానం వినిపించి, తన సహ రచయిత కథల్లో నాగావళీ తీర సాంస్కృతిక స్పర్శ పుష్కలంగా ఉందన్నాడు. వాడ్రేవు చిన వీరభద్రుడు టాగూర్‌ ‘ఫ్రూట్‌ గేదరింగ్‌’ జ్ఞాపకాలతోనో ఏమో, గౌరునాయుడనే కొంద దేశపు కొండదేశపు బొట్టెడు చింతచెట్టెక్కి దులుపుతుంటే జల జలా రానిన పండు వానలో సాగిద్దాం ఇక మన ఫల సేకరణ అంటూ ‘ఏటి పాట’కు హైలో హైలెస్తా పాడాడు.‘ఏటి పాట’ కథా సంపుటిలో ‘బడిసాల’ కథలో పిల్లలకు చదువుకోను సరైన బడి కూడా లేని గ్రామంలో పెద్ద తరాల్ని ఎదిరించి, కొత్తతరం ఎలా కొత్త పూరిపాక కడతారో, ఆ బడిలోంచి చదువుకునే పిల్లల ఆ,ఆ,ఇ,ఈల రాగం ఎలా వినిపిస్తుందో కథనంలో బిగి తగ్గకుండా చెప్పాడు కథా రచయిత.

ప్రతిఘటన, పరిరక్షణ జీవన సూత్రంగా, పిల్లలు బొంగరం జ్యాలీ మీంచి గిర్రున వదిలి, రక రకాల విద్యలు చూపిన రీతిన ‘జీవన సూత్రం’ కథలో పిడుగు పడి, సహజంగా గొడ్డు మేపుకునే గుంటడు కళ్ళుమూస్తే, పంచనామా కోసం వచ్చిన ఎసై్స- అందరూ కలిసి చంపేసి, పిడుగు పడిందని కథలు అల్లుతున్నారని, అయిదు వేలిస్తే హత్య విషయం సాగదీయకుండా తాము సంతృప్తి చెంది వెళ్ళిపోతామన్న దానికి కథలో పాత్ర ఇలా ఈసడిస్తుంది: ‘కోమిటోడ్ని చూసి సొంటి కొమ్ము అడిగిందట నక్క. పల్లెటూరోలంత బైగుగాళ్ళని ఖాకీ బట్టలు సూపించి, కళ్ళెర్ర జేస్సి బెదిరించి బుక్కియ్యాలని సూత్రుండు గావాల’.

శ్రీకాకుళం జీవభాష రాయగలిగిన మట్టి మూలాల మనిషి గౌరునాయుడు- లంచగొండి ఎసై్సకి, అలాగే అని ముందు ఒప్పుకున్న గ్రామస్థులచే ఆఖర్న ఆంతరంగికంగా సామూహిక సత్కార శిక్ష అమలు చేయిస్తాడు. తమ ప్రయోజనాలు అన్యాయమైపోయే చోట ప్రతిఘటన- పరిరక్షణ జీవ సూత్రంగా, పాఠకులు నమ్మగలిగే తీరున గౌరునాయుడు కథ నడిపిస్తాడు.రైతు జీవన రాయబారి గంటేడ గౌరునాయుడు. గొప్ప జీవన మర్యాదల్ని రైతులకు ఆపాదించి కవిత్వం రాయగలడు. ‘నాగలి’ దీర్ఘ కవిత, వ్యవసాయ యుగం మానవ ఇతిహాసంలో ఆరంభమైన మూలాన్నించి మొదలైన ఈ పనిముట్టు, ఇవాళ పని లేక గోడకు వేలాడుతుంటే, చూసిన ఇంగ్లీషు మీడియం మనవడి ప్రశ్న‘అదేమిటది?’. అక్కడే మొదలవుతుంది గౌరు నాయుడు రచన ‘నాగలి’. ఇందులో ‘ఆసర సాల’ను కవి పరిచయం చేస్తాడు.

‘ఆసర సాల/ కొత్త వ్యవసాయ పనిముట్ల కొలువు/ రైతన్నల నిత్యావసరాల నెలవు/ నాగలి/ నొల్ల/ సరుగుడు/ బండి/ కొడవలి/ గొడ్డలి/ బొడిగి/ పార/ కొంటికర్ర/ పువ్వుల కొరడా/ ములుగర్ర/ వ్యవసాయ పనిముట్ల ప్రయోగశాల ఆసర సాల’.అంటూ గ్రామీణ జీవన పరికరాలను తయారుచేసే ఆసరసాల ఆచారి (కమ్మరిపని చేసే వ్యక్తి)ని స్మరిస్తాడు. మారిపోయిన వ్యవసాయ విధానాలకు పాతపద్ధతులపై అలవాటుతో జీవించే రైతు గుండె కోత ‘నాగలి’ కవితలో వివిధ దశలలో చిత్రిస్తాడు. అలతి అలతి మాటలతో ఆదిమ కాలంనుంచీ వస్తున్న కథను కవిత్వంగా చెప్తూ, రైతులోకానికి పౌర వందనం చేస్తాడు ఉప్పొంగే ఆత్మగౌరవంతో, ‘నాగలి’ ఆఖరున.

‘భూ గోళం/ రైతు వీరుని బిగిసిన పిడికిలి/ ఆకాశం/ రైతు ఇల్లాలు అలికి ముగ్గేసిన వాకిలి/ భూమ్యాకాశాల నడుమ/ అవిశ్రాంత/ భ్రమణ గీతం నాగలి/ ఆ నాగలి/ తొలి పొద్దును/ నుదుట దిద్దుకుని/ ఎదురు చూస్తోంది చాలు కోసం/ నమ్మిన నేల కోసం’.ఏ ఆసర సాలనైతే పై దీర్ఘ కవితలో ప్రస్తావించి ప్రాణప్రతిష్ఠ చేశాడో, అదే ఇతివృత్త నేపథ్యంగల కథ ‘ఆసర సాల’ను తన మరో కథా సంపుటి. ‘ఒక రాత్రి రెండు స్వప్నాలు’లో నమోదు చేస్తాడు గౌరు నాయుడు. వీరాచారి ఇందులో కమ్మరి పనులు చేసే వ్యక్తి. పనులు యంత్రాలకు చెంది, సంప్రదాయాక పనిముట్లకు పెద్దగా అవసరం లేని క్షీణ దశలో, గ్రామంలోని పేదజనం మల్లే- వారి పనిముట్ల తయారీ కేంద్రం దిక్కులు చూస్తోంది పనుల్లేక. ఊర్లో ఉండడమా, ఊరు వదిలి కొడుకు మాట మీద, పొలాలు భవంతులవుతున్నా పార్తీపురానికి, నర్సిపురానికే పోవడమా అన్న సందిగ్ధత ఇసుమంతైనా లేకుండా ఉన్న పనితోనే ఆత్మ నిగ్రహంతో ఉంటాడు వీరాచారి.

ఆసర సాల వైభోగాలు గౌరునాయుడు చెప్తే వినాల, వీరాచారి జ్ఞాపకాలుగా. ‘ఊరందరికీ తల్లో నాలిక, కంసాలోడికీ- కాపోడికీ ఉన్న లంకి, నాగలికీ- నర్రుకీ ఉన్న లంకిరా’ అని నమ్మకం ఉన్నవాడు. ఒక నగర జీవనుడి నయవంచనలకు బలయి, పోలీసుల పాల పడి అవమానితుడు, ఆక్రోసితుడు అయ్యే కథ. విషాదం నిండిన హుందాతనంతో మెరిసిపోయే కథ ఇది. తన పట్ల తప్పు చేసినవాడు పశువుతో సమానమని క్షమించి, తమ ఊర్లో అడుగు పెట్టి తమ ‘ఆసర సాల’ వద్దకు వచ్చీసరికి ఇంగ్లీషు చదువులు చదువుతున్న మనవడి నోట నర్సరీ రైమ్‌లు వింటూ, వాడి నానమ్మ ఎత్తుకుంటుంది పాట.‘నాగలీ నీకిదే జోహారు/ మా భాగ్య దేవతా జోహారు/ రాజ్యాలు గెలిచినా రాదు నోటికి మెతుకు/ నీ కొనమీద బతకాలి కోటాను కోట్లు’.

పాశ్చాత్య నాగరకత, తమ ప్రాతం, జీవితంపై దాడి చేసి, మూలాలనుంచి ప్రభావితం చేస్తున్నప్పుడు, తమ పిల్లలే ఆ కొత్తదనాల పట్ల మోజు పడుతున్నప్పుడు ఆఫ్రికన్‌ గ్రామాల జీవితం ఎలా కడు విషాదవంతంగా చినువా అచి బె చెప్తాడో, అటువంటి విషాద గాంభీర్యత గౌరు నాయుడి కథల్లో జీవలక్షణంగా అంతటా అలముకుని ఉంటుంది.‘నా కథలన్నింటికీ... (ఏ కొద్ది కథలకో తప్ప) కేంద్రం మా ఊరే. నాగావళీ... ఒడ్డునే మా ఊరు... ఆ మనుషులు, మనుషుల మధ్య అనుబంధాలు, ఆత్మీయతలు, కష్టాలు, కన్నీళ్ళు- ఇవన్నీ కథల్లో చెప్పాలని...’ అని చెప్తూ ‘ఒక రాత్రి రెండు స్వప్నాలు కథా సంపుటికి తన మాటగా తవ్విపోసిన ‘మట్టి పొరల్లోంచి’లో ఇలా అంటాడు గౌరునాయుడు:

‘అందుకే గురజాడలో అడుగులు వేస్తూ, నా ముందు తరాల కథకుల్ని మరోసారి గుర్తు చేసుకుంటూ, మళ్ళీ రాయలనే ఉంది... నా మనుషుల గురించి, మాట గురించి, మట్టి గురించి... పాట, కవిత, కథ... ఏదో వొకటి... ఎందుకంటే ‘కతలైనా యెతలైనా అంత సులువుగా వొదుల్తాయేటి’.
ఈ కథా సంపుటాల్లో లేని ఇటీవలి కథ గౌరు నాయుడు రాసింది ‘మాయ’. ఇది ‘అభివృద్ధి పేరిట విధ్వంసం’లో రెండో అధ్యాయంలో మొదలవుతుంది. మొదటిది ఏమిటంటే, డెవలప్‌మెంట్‌ పేరిట ఏవో ప్రాజెక్టులకై స్థల సేకరణ ప్రయత్నాలు ప్రభుత్వాలు, ఆయా పెట్టుబడిదారీ వర్గాల తరపున జరపడం, దానికి వ్యతిరేకంగా ప్రజాచైతన్యం మేల్కొనడం, నిరసనలు, ప్రదర్శనలు, ప్రతిఘటనలు వగైరా.

గౌరునాయుడు ఇటువంటి దిక్కుమాలిన అభివృద్ధి మొదటి అధ్యాయం పూర్తయిన చోట, అంటే స్థానిక పల్లీయుల పునరావాసం జరిగిన చోట తన కథనెత్తుకుంటాడు. ఇళ్ళన్నీ చతురస్రాకారపు దిమ్మల్లా ఉండి, ఊరు అని పిలిచే ఏ లక్షణాలూ లేని ఒక పునరావాస కాలనీ అది. సర్కారువారు ఏర్పాటు చేసింది. ఈ పునరావాస కాలనీలో ఒకనాడు ఒక వ్యక్తి చనిపోతాడు. ఈ పునరావాసం దయతో ఏర్పరచిన ప్రభుత్వం ఈ సెటిల్మెంట్‌ కాలనీకి స్మశానం ఏర్పాటు చేయలేదు.దీనితో పొరుగూరు స్మశానానికి తీసుకువెడతారు. అక్కడ మా ఊరివాడు కాదు గాబట్టి, అతని అంత్యక్రియలకు అనుమతించం అంటారు పొరుగూరివారు. వీరికి ఒక స్మశానం లేదు, పొరుగూరిలో చుక్కెదురు అయింది.

దీనితో పునరావాస కాలనీలో జీవిస్తున్న గ్రామస్తులంతా తమ పాత ఊరు ఏదైతే వదిలి వచ్చారో, ఆ ఊరి స్మశానం దారి పడతారు. నిర్మానుష్యమైపోయిన ఈ ఊర్ని హృదయ విదారకంగా వర్ణిస్తాడు గౌరు నాయుడు. ఈ అంత్యక్రియల అమలును ఉదయంనుంచీ చూస్తూ, పొరుగూరిలో తిరస్కారం, తమ పునరావాస కాలనీలో స్మశానం కొరత, తమ పాత ఊరు ఊరంతా స్మశానం వలె ఉండడం చూసిన పాత్ర ఈ ఒత్తిళ్ళకు తట్టుకోలేక, తనకు ప్రాణాలమీదకు వచ్చిందన్న సూచనతో నర్మగర్భంగా కథ ముగుస్తుంది. ప్రజల్ని తమ మూలాల నుంచి తొలిచేస్తున్న ‘మాయ’ను శక్తిమంతంగా చిత్రించాడు గౌరునాయుడు.

నయా ఉదారవాద ఆర్ధిక విధానాల పేరిట, ఈ దేశాన అమలవుతున్న పలు పాలసీల పట్ల, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి. సుదర్శన్‌ రెడ్డి వంటి న్యాయనీతి కోవిదుల స్థాయిలో సైతం తీవ్ర అసంతృప్తి ఉంది. గౌరు నాయుడు ఏ వేదనలకు అక్షరాలను ఇచ్చాడో అటువంటి కృషిలో ఎవరెస్టంత ఎతె్తైన రచయిత రాచకొండ విశ్వనాథశాస్ర్తి పేరిట ఏర్పాటైన గౌరవం, పదిహేడవ రాచకొండ రచనా పురస్కారం ఈ నాగావళి తరంగానికి, శ్రీకాకుళం సౌరు నాయుడికి లభించడం పట్ల సర్వత్రా వెల్లడవుతున్న హర్షాతిరేకపు పొంగు, గంటేడ గౌరు నాయుడిచే సజీవ సాహిత్య సృజనను మరింత విస్తృతంగా చేయించేందుకు దోహదం కావాలి. రాచకొండ విశ్వనాథ శాస్ర్తి 17వ రచనా పురస్కారాన్ని గంటేడ గౌరు నాయుడుకు ప్రకటించిన సందర్భంగా...

క్షతగాత్రగానం - అట్టాడ అప్పలనాయుడు

పాటలు - గంటేడ గౌరునాయుడు



వాళ్ళు - అట్టాడ అప్పలనాయుడు

కధను డౌన్లోడ్ చేసుకోడానికి


లేదా

నవ్య వీక్లీలో చదువుటకు అక్టోబర్ 13, 2010 సంచిక తెరిచి అందులో అప్పలనాయుడుగారి ఇంటర్వ్యూ, కధా చూడగలరు

లేదా

ఈ క్రింది లింకును నొక్కగలరు.